మొబైల్‌ సిమ్‌ ఫోన్‌ నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునే వరకు ప్రతీ ఒక్క పనికి ఆధార్‌ కార్డ్‌ ఉండాల్సిందే. ఒక వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఆధార్‌ నెంబర్‌తో తెలుసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.

దీంతో ప్రతీ ఒక్కరూ అనివార్యంగా ఆధార్‌ కార్డ్‌ను తీసుకోవాల్సి వస్తోంది. ఇటీవలి కాలంలో చిన్నారులకు కూడా ఆధార్‌ కార్డులను అందిస్తున్నారు. అయితే ఆధార్‌లో కార్డులో అడ్రస్‌, ఫోన్‌ నెంబర్‌ లాంటివి మార్చుకోవడం చేస్తుంటారు. అవసరానికి అనుగుణంగా ఈ మార్పులు చేర్పులు చేసుకునే వారు. అయితే ఇకనుంచి ప్రతీ ఒక్కరూ తప్పకుండా ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

ఈ నేపథ్యంలో ఆధార్‌ కార్డ్‌ రూల్స్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఇకపై కార్డు కలిగి ఉన్న ప్రతీ ఒక్కరూ కనీసం 10 ఏళ్లకు ఒక్కసారైనా ఆధార్‌ బయోమెట్రిక్స్‌ లేదా అడ్రస్‌ లాంటివి అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆధార్‌లో ఏదైనా అప్‌డేట్‌ చేసుకున్న నాటి నుంచి పదేళ్ల లోపు ఒక్కసారైనా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని చెబుతున్నారు. ఆధార్‌ ఆథరైజ్డ్‌ సెంటర్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రస్తుతం ఐదేళ్లు, 15 ఏళ్లు దాటిన పిల్లల బయోమెట్రిక్స్ ను అప్ డేట్ చేసుకోవాలన్న నిబంధన ఉన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 134 కోట్ల మంది ఆధార్‌ కార్డ్‌ను తీసుకున్నారు. గతేడాది దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది తమ ఆధార్‌ కార్డ్‌లను అప్‌డేట్‌ చేసుకున్నారు. యూఐడీఏఐ అధికారులు మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం ఆధార్‌ కార్డ్‌ను తీసుకున్నవారు డాక్యుమెంట్ అప్‌డేటేషన్‌ చేసుకోవాలని తెలిపారు. అయితే ఈ అప్‌డేటేషన్‌ చేసుకోవడం కోసం కచ్చితంగా ఆధార్‌ సెంటర్‌ వెళ్లాలా.? లేదా ఆన్‌లైన్‌లో స్వయంగా చేసుకునే అవకాశం ఉందా అనేద దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.