అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు(Flipkart) డిస్కౌంట్ల పేరుతో చవక రేట్లలోనే కొన్ని ప్రొడక్ట్స్ మనకు అందుబాటులో ఉంచుతుంటాయి. బయట లభించే ధరకంటే చాలా తక్కువకే ప్రొడక్ట్స్‌ ఆన్‌లైన్‌లో(Online) లభిస్తాయి. ఇవి బయట ఇంత తక్కువ రేట్లకు దొరకవు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ-కామర్స్(E Commerce) ప్లాట్‌ఫామ్స్‌లో మాత్రం ఇవి అంత తక్కువకు ఎలా వస్తాయి..? కంపెనీలు భారీ ఆఫర్లను ఎలా అందిస్తాయి..? అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా..? ఈ డిస్కౌంట్ల వెనుక ఉండే టాప్‌ సీక్రెట్‌ తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.

మొన్న మొన్నటి వరకు అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్‌లు పండగ సేల్స్‌తో, డిస్కౌంట్లతో వినియోగదారుల్ని ఆకట్టుకుంటూనే ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ ఇంకా ఎన్నో ఉత్పత్తులపైన భారీ తగ్గింపులను అందించాయి. ఈ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు చిన్నా పెద్దా ఉత్పత్తులను సేకరించేందుకు నేరుగా తయారీదారులతో కాంట్రాక్ట్‌ కుదుర్చుకుంటాయి. దీంతో ఇవి ఎక్కువ అమ్మకాలు చేయడం ద్వారా ఎక్కువ డిస్కౌంట్లను కస్టమర్లకు ఇవ్వగలుగుతాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈ మధ్యే తమ నెల రోజుల ఫెస్టివల్ సేల్స్‌ ముగించాయి. ఇప్పటికీ కొన్ని పేర్లతో డైలీ ఆఫర్లు వీటిలో ఉంటున్నాయి. అయితే ఈ ఆఫర్ సేల్స్‌లో ప్రధాన ఆకర్షణ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు. వినియోగదారులు ఐఫోన్ 11ని రూ. 30,000 కంటే తక్కువ ధరకే పొందారు. దుస్తులు, ఇతర ఉత్పత్తులపైనా డిస్కౌంట్లు లభించాయి. వీటిని నేరుగా మాన్యుప్యాక్చరర్‌ దగ్గర నుంచి తీసుకోవడంతో ఈ-కామర్స్ పోర్టల్స్ ప్రొడక్ట్స్ ధరలను తగ్గించి అమ్మగలిగాయి. అయితే ప్రొడక్షన్ కంపెనీలు కూడా తమ అమ్మకాలను భారీగా పెంచుకోవడానికి తక్కువ ధరల్ని కోట్‌ చేసి ఆ రేటుకు తమ ఉత్పత్తుల్ని అమ్మమని ఈ-కామర్స్‌ సంస్థల్ని కోరతాయి. దీంతో ఈ తగ్గింపు రేట్లు సాధ్యమవుతాయన్నమాట. చిన్ని కంపెనీలతో ఒప్పందాలు

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు స్థానిక వ్యాపారాలను, దేశవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME)ను ప్రోత్సహిస్తాయి. దీంతో ఒకరి వల్ల ఒకరికి లాభం చేకూరుతుంది. MSMEలు మామూలుగా తమ వస్తువుల విక్రయాల విషయంలో స్థానికంగా పరిమితం అవుతాయి. అదే ఈ కామర్స్‌ సైట్లలో వారికి దేశ వ్యాప్తంగా మార్కెట్‌ లభిస్తుంది. దీంతో తమ వస్తువులను విక్రయించడం తేలికవుతుంది. పైగా మధ్యవర్తులూ ఉండరు. దీంతో ఈ-కామర్స్ సైట్‌లు బాగా తక్కువ ధరలకు ఉత్పత్తులను పొందుతాయి. దీంతో తగ్గింపులను అదే స్థాయిలో కస్టమర్లకు ఇవ్వగలుగుతాయి. ఈ విషయంపై అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్-ఇండియా కన్స్యూమర్ బిజినెస్, మనీష్ తివారీ మాట్లాడుతూ.. మహిళా పారిశ్రామికవేత్తలు, చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, స్టార్టప్‌లు, కళాకారులు, భారత కస్టమర్‌లకు ఎన్నో రకాల ఉత్పత్తులను అందిస్తున్నాయని చెప్పారు. టైర్ 2-3 నగరాల నుంచి విక్రయదారుల సంఖ్య పెరుగుతోందన్నారు. అమెజాన్‌లో ఈ సంవత్సరం MSMEల అమ్మకాలు 44 శాతం కంటే పెరిగాయన్నారు. ఇలాంటి ఈ-కామర్స్ సైట్‌లలో ఒకసారి ప్రొడక్ట్‌ను లిస్ట్ చేస్తే, దాన్ని చాలా మంది కొనుక్కుంటారు. అంటే వీటికి బల్క్‌గా ఆర్డర్లు వస్తాయి. ఈ కారణాల వల్ల అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు ఎక్కువ డిస్కౌంట్లను ఇవ్వగలుగుతున్నాయి.